ఆరుగురు భక్తులు మృతి- 50మందికి గాయాలు
గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్పందించారు.
శిర్గావ్లోని శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే’ ఆచారం ఉంది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ కావడం వల్ల భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నార్త్ గోవా పోలీసులు వెల్లడించారు. సమాచారం తెలుసుకన్న ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రాష్ట్రపతి, మోదీ సంతాపం
తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి దౌప్రది ముర్ము, ప్రధానంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు తర్వగా కోలుకోవాలి ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ప్రమాదంపై మోదీ ఆరా
ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు. అంతేకాకుండా ఘటనాస్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసిన తొక్కిసలాట ప్రమాదంపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు. అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు తెలిపారు.