మంత్రులతో సిఎం రేవంత్ సమీక్ష
హెచ్సియూ భూ వివాదంపై వొస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ విషయంలో నిజానిజాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం రేవంత్ అధ్యక్షతన పలువురు మంత్రులు కమాండ్ కంట్రోల్ రూమ్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో పూర్వాపరాలను చర్చించారు. అనంతరం మంత్రులు భట్టి, శ్రీధర్ బాబులు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి, ఒక అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలతో అనుసంధానంగా ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వర్సిటీ భూమి వర్సిటీకే ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనికి అడ్డుతగిలితే ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. సచివాలయంలో నిర్వహించిన మంత్రుల మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. గత రెండు రోజుల నుంచి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు అక్కడ ఉన్న రాక్ ఫార్మేషన్స్, లేక్లు, ప్రసిద్ధి గాంచిన మష్రూమ్ రాక్స్, పికాక్ లేక్ను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. హెచ్సీయూ పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడతాం. అవన్నీ ప్రభుత్వ భూముల్లో ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగా తీసుకుంటున్నాం. హెచ్సీయూ విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దు. పార్టీల ప్రలోభానికి లోనుకావొద్దని అని శ్రీధర్బాబు తెలిపారు.