ఈనెల 17వ తేదీ వరకు మిగిలిన దరఖాస్తులకు మోక్షం.ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించి పరిష్కారించింది. అయితే ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 1.06 లక్షల దరఖాస్తులకుపైగా రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఇక పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు తహసిల్దార్ కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు. ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ఫీల్డ్లో దరఖాస్తుదారుడు ఉన్నాడా.. లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాయి. ధరణి పోర్టల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లకు లాగిన్ ఆదేశాలు రాగానే పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్ వర్క్ త్వరలో ప్రారంభం అవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం పరిశీలన గడువును పెంచడం బాధితులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.