మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి షికా గోయల్, ఐపీఎస్ రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ వరల్డ్ కంటిస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు, ఏమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
వీడియోలను సైతం రికార్డు చేస్తుండటం గమనార్హం. దేశ పరువు, ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కావడంతో సీఎం నేరుగా ఎప్పటికప్పుడు విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. కంటిస్టెంట్ లతోపాటు.. మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆరోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
మిల్లా మాగీ ఆరోపణలివే..
‘హైదరాబాద్లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా’ అంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణపై గౌరవం పెరిగిందని, అతిథ్యం బాగుందని మెచ్చుకుంటూనే మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలని పేర్కొన్నారు. ప్రపంచ సుందరి-2025 పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన ఆమె ఇంగ్లాండ్ చేరిన తర్వాత చేసిన ఈ వ్యాఖ్యల్ని బ్రిటిష్ మీడియా ప్రచురించింది. ఈ కథనాలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే ఖండించారు. ఆ వాదనలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సైతం తోసిపుచ్చారు.