Wednesday, July 3, 2024

భూముల మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం…

ఆగష్టు 01వ తేదీ నుంచి అమల్లోకి….
ప్రాంతాన్ని బట్టి 40 నుంచి 60 శాతం మేర పెరిగే అవకాశం
7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మార్పు

భూముల మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన మార్కెట్ విలువలు ఆగష్టు 01వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అన్ని జిల్లాల డిఐజీలకు, డిఆర్‌లకు, సబ్ రిజిస్ట్రార్‌లకు మెమో ఎంవి/539/2014, తేదీ 14.06.2024లో మార్గదర్శకాలను జారీ చేశారు. ఇప్పటికే మార్కెట్ విలువల పెంపునకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో దానికి సంబంధించి కసరత్తును ఆయా జిల్లాల అధికారులు ప్రారంభించారు. సబ్ రిజిస్ట్రార్‌లు తమ ప్రాంతం పరిధిలో ప్రస్తుతం మార్కెట్ విలువలు, ప్రైవేటు ధరల ఆధారంగా ఈ విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సబ్ రిజిస్ట్రార్‌లు ఇచ్చే మార్కెట్ విలువలపై ఆయా జిల్లాల కలెక్టర్‌లు, ఆర్‌డిఓలు, తహసీల్దార్‌లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మరోసారి సమీక్ష చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. 18వ తేదీ లోపు అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్‌లు తమ పరిధిలోని మార్కెట్ విలువలను సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా సబ్ రిజిస్ట్రార్‌లు కసరత్తు చేస్తున్నారు.

ఈనెల 18వ తేదీన మొదటి సమావేశం
ఈనెల 18వ తేదీన ఆయా జిల్లాలోని అడిషనల్ కలెక్టర్‌లు, ఆర్‌డిఓలు, సర్వేయర్‌లు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు మార్కెట్ విలువల పెంపునకు సంబంధించి సమావేశం కానున్నారు. అనంతరం 23వ తేదీన మార్కెట్ విలువలకు సంబంధించి రీవిజన్ చేయనున్నారు. 25వ తేదీన సబ్ రిజిస్ట్రార్‌లు పంపించిన నివేదికల మీద సి అండ్ ఐజీతో రివ్యూ మీటింగ్, 29వ తేదీన మార్కెట్ విలువలకు సంబంధించి అప్రూవల్ కమిటీ సమావేశం, జూలై 01వ తేదీన మార్కెట్ విలువలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూలై 15వ తేదీన అభ్యంతరాల స్వీకరణకు చివరితేదీగా అధికారులు పేర్కొన్నారు. జూలై 24వ తేదీన రీవైజ్ కమిటీ చివరగా మార్కెట్ విలువలకు ఆమోదం తెలుపనుంది. అనంతరం ప్రభుత్వానికి కొత్త మార్కెట్ విలువలను ఆయా జిల్లాల కలెక్టర్‌లు సమర్పించనున్నారు. జూలై 31వ తేదీన కొత్తగా ఆమోదం పొందిన మార్కెట్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఆగష్టు 01వ తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి.

మార్కెట్ విలువ పెంపు ఇలా…
నేషనల్ హైవేలు, పారిశ్రామిక వాడలు, కమర్షియల్ జోన్‌లు, గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్ర రహదారులు ఆనుకొని ఉన్న నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాలకు ఆయా ప్రాంతాల ఆధారంగా మార్కెట్ విలువలను అధికారులు నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ధర, ప్రైవేటు విలువల ఆధారంగా ఈ కొత్త మార్కెట్ విలువలను నిర్ణయించనున్నారు. దీంతోపాటు ఆయా గ్రామాలు, పట్టణాల్లోని స్థానికులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ, మున్సిపల్ అధికారుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ఈ విలువలను ఫైనల్ చేయనున్నారు.

కొన్ని జిల్లాలో ఆయా డెవలప్‌మెంట్ అథారిటీల ఆధారంగా…
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలో జోనల్ డెవలప్‌మెంట్, సంబంధిత అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ప్రణాళికలను పరిగణలోకి తీసుకొని ఈ మార్కెట్ విలువలను పెంచనున్నారు. మిగిలిన పట్టణ ప్రాంతాలకు, సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌లను పరిగణలోకి తీసుకొని కొత్త విలువలను ఫైనల్ చేయనున్నారు.

వ్యవసాయ భూముల విలువల పెంపులోనూ…
సాగు, సాగేతర భూముల మార్కెట్ విలువల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. రాబడులు పెంచుకునే మార్గాలపై ఇటీవల ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలపై ఉన్నతాధికారులతో అంతర్గతంగా చర్చించింది. వాస్తవ ధరలకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

హైదరాబాద్ శివార్లలో కొన్ని చోట్ల మార్కెట్ విలువ కన్నా వాస్తవ ధర వందల రెట్లు అధికంగా ఉందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రస్తుతం ఏ మేరకు ఆదాయం సమకూరుతోంది, భూముల విలువలు ఏ మేరకు పెంచే అవకాశం ఉంటుంది, తద్వారా ఏ మేరకు రాబడి పెరుగుతుందనే సమాచారాన్ని ప్రభుత్వం స్వీకరించింది. 2021, 2022 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం సాగు, సాగేతర రంగాల్లో ఏ మేరకు మార్కెట్ విలువలు పెంచింది, తద్వారా ఎంత రాబడిని అదనంగా సాధించింది అనే అంశాలను సేకరించింది.

గతంలో సుమారుగా రూ.5వేల కోట్ల ఆదాయం
గతంలో ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచడం ద్వారా దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా రాబడి వచ్చిందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో సాగు, సాగేతర భూముల క్రయ, విక్రయాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని పెంపును నిర్ధారించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పెంపు ప్రాంతాన్ని బట్టి సుమారుగా 40 నుంచి 60 శాతం మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

సాగు, సాగేతర భూములకు వేర్వేరుగా ఈ పెంపును ప్రతిపాదించే వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మార్పు జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరా కనీస ధర ప్రస్తుతం రూ.75 వేలు ఉండగా దీనిలోనూ మార్పులు చేయనున్నారని, వాస్తవ ధరలు భారీగా ఉన్న చోట పెంపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular