కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సైట్ కేటాయింపు కుంభకోణం కేసులో సిద్ధరామయ్య విచారణ ఎదుర్కోనున్నారు. ముడా ద్వారా స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయవాది-కార్యకర్త టిజె అబ్రహం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సిద్ధరామయ్యను విచారణ చేయడానికి గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ధ్రువీకరించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు.
కాగా.. సిద్ధరామయ్యకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని, విచారణకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం గతంలో సూచించినప్పటికీ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గవర్నర్ చర్యలను “రాజ్యాంగ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడం”గా మంత్రివర్గం అభివర్ణించింది. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా గవర్నర్ నిర్ణయాన్ని ఖండించారు. ముడా భూకుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సీఎం సిద్దరామయ్య అత్యవసర క్యాబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. సాయంత్రం మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. భూకుంభకోణం విచారణపై చర్చించనున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు పయనమైనట్లు తెలుస్తోంది.
ముడా స్కామ్ వివాదం ఏంటంటే?
మైసూర్ అభివృద్ధి కోసం ‘ముడా’ భూమి సేకరించింది. బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఎకరం తీసుకుంటే అర ఎకరం అభివృద్ధి చెందిన భూమి తిరిగిస్తారు. లేదంటే ఆర్థిక ప్యాకేజీ ఎంచుకోవచ్చు. సిద్దరామయ్య భార్య పార్వతి నుంచి తీసుకున్న భూమికి 14 సైట్లు కేటాయించడం వివాదంగా మారింది. ప్రజలకు తక్కువ డబ్బు ఇచ్చారని, కొందరికి ఇవ్వలేదని, తక్కువ రేటుకు సన్నిహితులకు భూములు అమ్మేశారని అధికారులపై ఆరోపణలు ఉన్నాయి.