ఎమ్మెల్యేకు చెందిన 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
చాలారోజుల గ్యాప్ తర్వాత హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఓ ఎమ్మెల్యేలకు చెందిన నిర్మాణాలను కూల్చివేసింది. ఏపీలోని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన హఫీజ్పేటలోని వివాదాస్పదమైన 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేసింది. గత కొన్నాళ్లు సైలెంట్ అయిన హైడ్రా ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచింది. ఆ 20 ఎకరాల భూమి విలువ దాదాపు రూ.2వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా. వసంత గ్రూప్ పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 20 ఎకరాల భూమిపై కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణ నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా భూమిలో కొంత భాగాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ.. ఆ భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధి కొండపూర్లోని ఆఫీజపేట సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమిగా అదే జాబితాగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబరు 79/1 గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలను వసంత హోమ్స్ చేపట్టినట్లు గుర్తించారు. ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేశారని, ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు పలు షెడ్డులు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు వసంత హోమ్స్ నిర్మాణ సంస్థ అద్దెకు ఇచ్చిన్లు తేలింది. అయితే, ఈ భూములపై సుప్రీం కోర్టులో చాలా కాలంగా సి.ఎస్.14/58 అనే వాజ్యం పెండింగులో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చారు. ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులుండగా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకాకుండా నిర్మాణాలు మొదలుపెట్టారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో.. ఫైనల్ డక్రీ రాకుండానే ఈ భూములలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాల తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని హైడ్రాను ఆదేశించింది. దీంతో అక్కడ నిర్మాణాలను కూల్చివేశారు.