అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణ సర్కార్ ఎస్సీలకు తీపి కబురు చెప్పింది. దశాబ్దాల కల నెరవేరుస్తూ.. ఎస్సీ వర్గీకరణకు అధికారికంగా జోవో విడుదల చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు ఉపసంఘం ఛైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త జీవో ప్రకారం ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించి రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. ఏ గ్రూపులో ఏయే కులాలు ఉన్నాయి? రిజర్వేషన్ ఏంతనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల నెరవేరింది. ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వు (జీవో)ను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సర్కార్ గెజిట్ను విడుదల చేసింది.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు 59 ఉపకులాలను మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించారు, ఈ విభజన జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా జరిగింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబాటుకు గురైన 15 ఉపకులాలు గ్రూప్-ఏ కిందకు వస్తాయి. ఇక మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలు గ్రూప్-బీలో ఉంటాయి. రిజర్వేషన్ల ద్వారా గణనీయమైన ప్రయోజనం పొందిన 26 ఉపకులాలు గ్రూప్-సీలో ఉంటాయి.
ఏ గ్రూపులో ఏ కులం..? రిజర్వేషన్ ఏంతంటే..?
గ్రూప్-ఏలోని కులాలు
సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ ఏలో చేర్చారు. ఈ గ్రూపులోని కులాలు 2011 జనాభా లెక్కల ప్రకారం మెుత్తం ఎస్సీ జనాభాలో 3.288 శాతంగా ఉన్నాయి. వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూప్లో డక్కలి, బుడగ జంగాలు, చిందు, మోచి, రెల్లి, అడి ఆంధ్ర, మస్తీన్, బైండ్ల, చాచాటి, డొంబ్, గౌండు, జమ్మడిదొస్తు, మంగ్, సప్పురి, సిండొల్లు కులాలు ఉన్నాయి.
చంద్రబాబు చేసిన చట్టం వలనే న్యాయం బతికింది.. మందకృష్ణ
గ్రూప్-బిలోని కులాలు
మధ్యస్థంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూప్-బీలో చేర్చారు. ఈ గ్రూపు ఎస్సీ జనాభాలో 62.748 శాతంగా ఉంది. వీరికి అత్యధికంగా 9 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇందులో మాదిగ, మాదిగ దాసు, అనంతకాళ, అరుంధతీయ, బవురి, బెల్లి, బోడెమ్, బైరి, చామర్, చండాల, దండాసి, దోసాద, గసాల, గోదాగలి, హోలెయ, జగ్గలి, మాతంగి, మెహతర్ వంటి కులాలు ఉన్నాయి.
గ్రూప్-సిలోని కులాలు
రిజర్వేషన్ ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్-సిలో చేర్చారు. ఈ గ్రూపు ఎస్సీ జనాభాలో 33.963 శాతంగా ఉంది. వీరికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మాల, మాల అయ్యవారు, అడి ద్రవిడ, అర్వమాల, బండ, చలవాది, చంబర్, దేవాంగ, దుదెకుల, గాండి, గోసాంగి, హరిజన్, హోలెయ దాసరి, జలగం, జంగం, కట్టిక, కొమ్ము, మహార్, మాల దాసరి, మాల హనాయ్, మాల జంగం, మాల మస్తీన్, మాల సాలె, సమగర, సతాని వంటి కులాలను చేర్చారు.
కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2026 జనాభా లెక్కల తర్వాత ఎస్సీల రిజర్వేషన్ను 18 శాతానికి పెంచే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇతర వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను కూడా 42 శాతానికి పెంచే బిల్లును ఆమోదించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.