- సిఎం రేవంత్ ఇంటి ఎదుట పిల్లలతో సహా వెళ్లి
- తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి
గురుకుల అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. జూబ్లీహిల్స్లోని సిఎం రేవంత్ ఇంటి ఎదుట పిల్లలతో సహా వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని వారు ముఖ్యమంత్రిని వేడుకున్నారు. రాఖీ పండగ సందర్భంగా ఈ అక్కాచెల్లెలకు న్యాయం చేయాలంటూ సిఎంకు రాఖీ శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. గురుకులాల్లో డౌన్మెంట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని వారు కోరారు.
గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో 9,210 పోస్టులు డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం, వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టుల కేడర్ వేరు అయినప్పటికీ కూడా కొన్ని పేపర్లు ఉమ్మడిగా నిర్వహించడం వల్ల చాలామంది అభ్యర్థులకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని అభ్యర్థులు పేర్కొన్నారు.
ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒక ఉద్యోగంలో మాత్రమే చేరుతారని, దీంతో 2,500 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలా మిగిలిన పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్ధులతో భర్తీ చేసే విధంగా ఇదివరకే ఉన్న సుప్రీంకోర్టు తీర్పులు ఆధారంగా చేసుకొని ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో మార్చి నెలలో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని వారు గుర్తుచేశారు. అయినా కోర్టు తీర్పు అమలు చేయకుండా గురుకుల బోర్డు కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. గురుకుల నియామకాల్లో పోస్టులు మిగిలిపోకుండా నెక్ట్ మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.