ఎండలు ముదిరాయి. మార్చి వచ్చిందో .. లేదో.. సూర్యుడు భగ భగ మంటున్నాడు. దీంతో తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. ఎస్సెస్సీ పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 15కు ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలనే వినతులు వస్తున్నాయి. పదోవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 35 డిగ్రీలు దాటుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పటికే రంజాన్ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లకు విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి.