రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.