కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎన్సి భూక్య హరిరామ్ ను ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు హరి రామ్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరి రామ్ కీలకంగా వ్యవహరించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్సీ హరి రామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం ఆయనను పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. సుమారు రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హరిరామ్ ఇంటితోపాటు ఏకకాలంలో బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 14 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. గజ్వేల్, మార్కుర్లో 28 ఎకరాల భూమి, కొండాపూర్ షేక్స్పేట్, శ్రీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లు, పటాన్ చెరువులో 20 గుంటల భూమి, ఆరెకరాల మామిడి తోట, ఫామ్ హౌస్ను గుర్తించారు.
ఆయనదే కీ రోల్
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరోపక్క, కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో హరిరామ్ ఇల్లు, జలసౌధ కార్యాలయం, హరిరామ్ బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు సహా 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు కళ్లుచెదిరే ఆస్తులను గుర్తించారు. ఏసీబీ ప్రకటన ప్రకారం.. హరిరామ్కు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ ఉన్న మర్కూక్ మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది. అంతేకాక, హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్కాలనీ, నార్సింగ్లో ఫ్లాట్లు ఉన్నాయి. పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు కూడా ఉన్నాయి.