•బాండ్ పేపర్లపై రాసిచ్చిన హామీలు ఏమయ్యాయి..
•స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి..
•వోట్ల రూపంలో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలి
•మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లలో కన్నీళ్లే కనిపి స్తున్నాయని, ఎన్నికల ముందు అనేక హామీలన్నీ అటకెక్కించారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇందిరాపార్క్, ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారని, రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరీ హామిలిప్పించారని, సోనియా గాంధీతో లెటర్లు రాయించారు. హామీలన్నీ ఏమయ్యాయని హరీష్ రావు ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 11 సార్లు దిల్లీ పోయినా రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్పందించి ఆర్ఎంపీ, పీఎంపీలకు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాడులు లేవు, కేసులు లేవు. కాంగ్రెస్ హయాంలో ఏ రాత్రి ఎవరు వస్తారో, ఎట్ల అరెస్టులు చేస్తారో తెలియని దుస్థితి నెలకొందన్నారు. ఆర్ఎంపీలను పోలీసులను పెట్టి వేధిస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టలో చెప్పారు. కేసులు పెట్టి బతుకు దెరువు లేకుండా చేస్తున్నారు. ఆర్ఎంపీలను రోడ్ల మీదకు తెచ్చారు. రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య మంత్రి తక్షణం స్పందించి ఆర్ఎంపీలపై కేసులు పెట్టకుండా చూడాలని, ఎన్నికల హామీలో చెప్పినట్లు ట్రైనింగ్ ఇప్పించాలని, సర్టిఫికెట్లు ఇప్పించాలి. బీఆర్ఎస్ హయాంలో మీకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తే, కొందరు స్టేలు తెచ్చారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసే యత్నం చేస్తే, స్టేలు తెచ్చారన్నారు. అయినా కూడా మిమ్మల్ని పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పలేదని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు వొచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయని,గీత కార్మికుల పొట్ట కొడుతున్నారని, రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, చివరకు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మొదటి హామీ మహాలక్ష్మి, చివరి హామీ పింఛన్లు దిక్కు లేదన్నారు. రైతు రుణ మాఫీ మీద ఏ ఊర్లకైనా పోదాం చర్చిద్దాం. ఇవ్వాల్సింది 45వేల కోట్లు, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెబుతున్నది 21, ఇచ్చింది 15, 16వేల కోట్లు. రుణమాఫీ పెద్ద మోసమని విమర్శించారు.
ఆ 15,16 వేల కోట్లు కూడా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి 8వేల కోట్లు, రుణమాఫీకి ఇచ్చాడని అన్నారు. రెండు నెలల పింఛన్ 2వేల కోట్లు ఎగ్గొట్టి, రుణమాపీకి ఇచ్చారని, కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ చీరలు వెయ్యి కోట్లు, కేసీఆర్ ఇచ్చే న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు బంద్ పెట్టారని, అందులో రెండు వేల కోట్లు, పిల్లల ఫీజు రియింబర్స్ మెంట్ కూడా ఎగ్గొట్టారని, అందులో నుంచి 2500 కోట్లు రుణమాఫీలో కలిపాడని అన్నారు. ప్రజలు ఎవరు వొచ్చినా ప్రతి రోజు సీఎం కలుస్తారు అంటున్నాడు.. 15 నెలలు అయినా ఎవర్నీ కలవలేదు. కోడంగల్ వాళ్లను కూడా రానివ్వలేదు. మీ సత్తా చూపే సమయం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కలసి ఉండాలి. విడిపోయి ఉండొద్దు. అప్పుడే మీకు బలం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణం కట్టుకోవాలి. వొచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి, ప్రశ్నిస్తా నిలదీస్తానని హరీష్ రావు చెప్పారు.
ఏపని కావాలన్నా 30 పర్సెంట్ ఇవ్వాల్సిందేనని, తమది 30 పర్సెంట్ గవర్నమెంట్ అని ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆరోపించారు. పోలీసు వాళ్లకు జీతాలు రావడం లేదు, పోలీసులు, ఆటో డ్రైవర్లు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతోంది. ఉద్యోగస్థులకు డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ అయిన వారికి బెన్ఫిట్స్ ఇవ్వడం లేదు మాటల గారడీ, అంకెల గారడీ అని అందరికి అర్థమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి దిల్లీకి పొయ్యి ప్రచారం చేశారు. 80 స్థానాల్లో 77కి డిపాజిట్లు గల్లంతు. తెలంగాణలో ఏ ఊళ్లకు పోయినా కాంగ్రెస్ పాలన గురించి ప్రజలు చెబుతారని, కేరళ, మహారాష్ట్ర,దిఢిల్లీలో ఉపన్యాసాలు దంచడం కాదు, గల్లీకి పోదాం రా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు.
ఒకే ఏడాదిలో లక్షా 47వేల కోట్ల అప్పు చేశారు. ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఓ కాళేశ్వరం కట్టింది లేదు, చెరువు చెక్ డ్యాం నిర్మించింది లేదు. 10 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4కోట్ల 17లక్షలు చేస్తే, రేవంత్ ఒకే ఏడాదిలో లక్షా 47వేల కోట్లు చేశాడు. ఒక్క రూపాయి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. పైసా ఇవ్వలేదు. దైర్యం కోల్పోకండి. కష్టం వస్తే పోరాడాలి. సమస్యను పరిష్కారం చేసుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. వొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వోట్ల రూపంలో కర్రు కాల్చి వాత పెట్టాలని, ప్రజలు ఎంత కోపంగా ఉన్నరో తెలియాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు.