హరీష్ రావు ఎదుట కన్నీళ్ల పర్యంతమై గోడువెల్లబోసుకున్న బాధితులు..
హరీశన్నా.. మా ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తమగోడును వెల్లబోసుకున్నారు. కారుకు అడ్డు వొచ్చి తమ కష్టాలను వివరించారు. గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద పేదల షాపులను కూలగొడుతున్నారని తెలిపారు. దీంతో మున్సిపల్ అధికారులపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు, దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్ల బతుకుతారని ప్రశ్నించారు.
బాధితులకు ధైర్యం చెప్పి, అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చారు. ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎలా అంటూ నిలదీశారు. 20,30 ఏళ్ల నుంచి ఇక్కడి దుకాణాలపైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిపై దెబ్బకొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. హరీశ్ రావు నిలదీయడంతో హుటాహుటిన ఘటన వద్దకు కమిషనర్ చేరుకున్నారు. కమిషనర్ సూచనతో మునిసిపల్ సిబ్బంది కూల్చివేతలు నిలిపి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.