హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకంపై మొదటిసారి యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. గచ్చిబౌలి భూములపై హెచ్సీయూ రిజిస్ట్రార్ సోమవారం కీలక ప్రకటన చేశారు. వర్సిటీకి కేటాయించిన భూములను వేలం వేయాలన్నా, అమ్మాలనన్నా ఎగ్జిక్యూటి కమిటీ వేయాల్సిందే అని హెచ్సీయూ తెలిపింది.
భూములు అమ్మడానికి తాము అంగీకరించలేదని యూనివర్సిటీ యాజమాన్యం చెప్పుకొచ్చింది. అలాగే యూనివర్సిటీ భూముల హద్దులను నిర్ణయించడానిక యాజమాన్యం అంగీకరించలేదని, ఆ ప్రాంతం పర్యావరణం, జీవవైవిద్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపింది. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తేల్చిచెప్పారు.
హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండించారు. ఇప్పటి వరకూ భూమి సరిహద్దులు గుర్తించలేదని అన్నారు. ఈ విషయంపై హెచ్సీయూకు సమాచారం ఇవ్వలేదని రిజిస్ట్రార్వెల్లడించారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్నికోరతామని తెలిపారు.
ఇటీవల పత్రికల్లో వచ్చిన టీజీఐఐసీ ప్రకటనను కూడా ఖండించారు. యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీకి కేటాయించిన భూమిని బదిలీ చేయాలి అంటే విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితోనే జరుగుతుందని హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.