టీఎస్ న్యూస్: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఎల్లుండి( ఈ నెల22న) విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. తన అరెస్టు అక్రమమని, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఈడీని ఉల్లంఘించిందని పేర్కొంటూ కవిత సుప్రీకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం
చేపట్టనుంది. ఇదిలా ఉండగా కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఆమెను అరెస్టు చేసి మరుసటి రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. లిక్కర్ స్కాం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ వేయగా 7 రోజుల కస్టడీని మంజూరు చేసింది కోర్టు. ఇవాళ్టితో నాలుగు రోజుల కస్టడీ పూర్తవుతుంది. కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది.