- పంటనష్టంపై ముఖ్యమంత్రి ఆరా
- పిడుగుపాటుతో మృతిచెందిన వారిని ఆదుకుంటాం: ముఖ్యమంత్రి హామీ
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి,వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తగిన సాయం అందించాలని సిఎం సూచించారు.
మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సిఎం విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన ఇద్దరి కుటుంబాలను ఆదుకుంటామని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి పోతే, రైతులు ఆందోళన చెందవద్దని సిఎం హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.