తండ్రి ఆశిస్సులు తీసుకున్న మాజీ సీఎం
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. భూ కుంభకోణంలో అరెస్టై గత 5 నెలల నుంచి జైలులో ఉన్న జార్ఖండ్ ముక్తీ మోర్చా – జేఎంఎం నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు శుక్రవారం కోర్టులో బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. హేమంత్ సోరెన్ కు బెయిల్ రావడంతో జేఎంఎం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటికి రాగానే, కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
దేశంలో రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తోందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్ భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి బిర్సా ముండా జైలుకు వెళ్లిన హేమంత్ సోరెన్ కు బెయిల్ రావడంతో శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ కు స్వాగతం పలికేందుకు జేఎంఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున బిర్సా ముండా జైలు దగ్గరకు వచ్చారు.
జేఎంఎం పార్టీ కార్యకర్తలు హేమంత్ సోరెన్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే హేమంత్ సోరెన్ తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీస్సులు తీసుకున్నారు. తనకు మద్దతు తెలిపిన వారితో పాటు న్యాయ వ్యవస్థకు హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ధన్యవాదాలు చెప్పారు.