Friday, May 23, 2025

హెరాల్డ్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి ఈడీ ఛార్జిషీట్‌ లో పేరు

నేషనల్ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. యంగ్‌ ఇండియన్, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు విరాళాలు అందించేందుకు సాయం చేసిన కాంగ్రెస్‌ నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కానీ ఆయన్ని నిందితుడిగా పేర్కొనలేదు. ఏప్రిల్ 9న కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కొడుకు రాహుల్‌ గాంధీ.. యంగ్ ఇండియన్‌ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్‌ లిమిటెడ్‌ (AGL) కు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు మళ్లించేందుకు ప్లాన్ వేసినట్లు ఆరోపణలు చేసింది. 2019-2022 మధ్య రేవంత్‌ రెడ్డితో పాటు పవన్‌ బన్సాల్, అహ్మద్‌ పటేల్ వంటి కొందరు కాంగ్రెస్ నేతలు ఏఐ, ఏజీఎల్‌కు విరాళాలు ఇచ్చేందుకు కొంతమందిని ప్రభావితం చేశారని ఈడీ తెలిపింది. ఈ విరాళాలు లీగల్‌ కావని.. రాజకీయ ప్రయోజనాలు ఆశించి వచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఏంటీ నేషనల్ హెరాల్డ్‌ కేసు ?
అసోసియేటెడ్ జర్నల్స్‌ లిమిటెడ్‌ (AGL) కంపెనీ.. నేషనల్ హెరాల్డ్ న్యూస్‌ పేపర్‌ను ప్రచురించేది. అయితే 2008లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పేపర్‌ ప్రచురణ ఆగిపోయింది. దీంతో ఇండియన్ నేషలన్ కాంగ్రెస్‌ ఏజీఎల్‌ కంపెనీకి రూ.90.25 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చింది. దీంతో 2010లో యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కొత్త సంస్థ ప్రారంభమయ్యింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. అయితే యంగ్‌ ఇండియన్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి ఏజీఎల్‌ ఆస్తులు పొందినట్లు, ఇందులో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈడీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ కోర్టుకు ఈడీ చెప్పిన వివరాల ప్రకారం.. సోనియాగాంధీ తన ఏఐసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి, యంగ్ ఇండియన్ ద్వారా ప్రజా ధనాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఈడీ సోనియా గాంధీని ఏ వన్‌గా, రాహుల్‌గాంధీని ఏ2గా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది.
కాంగ్రెస్‌ను చికాకు పెడుతున్న కేసుల్లో నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి. ఇందులో నిందితులుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా భాగం ఉందని ఈడీ పేర్కొనడంతో సంచలనంగా మారుతోంది. దీంతో ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. యంగ్‌ ఇండియా సంస్థ ఏర్పాటు చేసి అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ ఆస్తులు కొట్టేయడానికి యత్నించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఆస్తుల విలువ దాదాపు రెండు వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ యంగ్‌ ఇండియా సంస్థ ఏర్పాటులో చాలా మంది కాంగ్రెస్ నేతలు భాగమయ్యారని 2019-22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేశారని పేర్కొంది ఈడీ. పదవులు, ఇతర ప్రయోజనాలు ఎర చూపించి డబ్బులు వసూలు చేసినట్టు పేర్కొంది. అందులో అప్పటి పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి, పవన్ బన్సల్‌, అహ్మద్ పటేల్ భాగమయ్యారని తెలిపింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ విషయాన్ని ఛార్జిషీట్‌లో పెట్టినట్టు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో విచారణలో భాగంగా గతంలో సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్‌ను కూడా ఈడీ విచారించింది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com