తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత, సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలను తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో డిస్టిబ్యూట్ చేసిన ‘దిల్’ రాజు మీద ఐటీ దాడులు చిత్ర సీమలో సంచలనం సృష్టించాయి. ఈ సందర్భంగా నాలుగు రోజులుగా తమ ఆఫీసులతో పాటు ఇళ్లలోనూ జరిగిన ఐటీ రైట్స్ గురించి దిల్ రాజు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడులపై ఎక్కువగా ఊహించుకోవద్దని, ఎటువంటి హడావిడి లేదని, ఇండస్ట్రీలో అంతా ఆన్లైన్ బుకింగ్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని దిల్రాజు వివరించారు. అగ్ర హీరోలకు చెందిన సినిమాలు విడుదలైన సమయంలో కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం ఇండస్ట్రీలో సహజంగా జరిగుతుందని, అది తప్పు అని, ఆ తీరును మార్చుకోవాలని, ఇండస్ట్రీ అంతా కూర్చుని ఆ అంశం మీద మాట్లాడతామని ‘దిల్’ రాజు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తనను ఐటీ శాఖ టార్గెట్ చేశారని వచ్చిన వార్తలను ఖండించారు. తాను ఏమీ టార్గెట్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రైడ్ సాధారణంగా జరిగే ప్రాసెస్ అని, తమ ఆఫీసుల్లో ఈ విధమైన సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయ్యిందని, అందువల్ల రైడ్ చేశారని ఆయన వివరించారు.
నాలుగు రోజులుగా తన ఇళ్ళు, ఆఫీసుల్లోనూ సోదాలు జరిగాయని, తమ దగ్గర భారీ ఎత్తున డబ్బు, డాక్యుమెంట్స్ దొరికాయని జరిగిన ప్రచారం ఉత్తిదేనన్నారు. తమ వద్ద కేవలం 20 లక్షల రూపాయల నగదు మాత్రమే లభించిందని, గత ఐదేళ్లుగా తాము ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదన్నారు. డాక్యుమెంట్స్ అన్నీ ఐటీ శాఖ చెక్ చేశారని, చివరకు వాళ్లే ఆశ్చర్యపోయారన్నారు. మాదంతా క్లీన్” అని వివరించారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమని చెప్పారని, తమ ఆడిటర్లు వెళ్లి కలుస్తారని దిల్ రాజు తెలిపారు.
తన తల్లి అనారోగ్యానికి గురయ్యారని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల తన తల్లి ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారని, అంతకు మించి ఏమీ లేదని, ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.