-
గోవా నుంచి మద్యం ఎలా తీసుకురావాలి..?
-
సోషల్మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిపై
-
కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు
-
10 మద్యం బాటిళ్లు స్వాధీనం
ఓ వ్యక్తి గోవా నుంచి మద్యం ఎలా తీసుకురావాలి అంటూ ఓ రీల్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోను చూసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట హాట్ టాఫిక్గా మారింది. హైదరాబాద్కు చెందిన బోరిగర్ల ఆనందపాల్ అలియాస్ కోటి యాదవ్ అనే వ్యక్తి ఇటీవల గోవా వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఫ్రెండ్స్ కోసం గోవా నుంచి 15 మద్యం బాటిళ్లను హైదరాబాద్కు తీసుకొచ్చారు. అనంతరం ఆయన నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆయన గోవాలో ఎన్ని మద్యం బాటిళ్లు కొన్నారు, ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేశారు, ప్యాకింగ్ ఎలా చేయించారు..? విమానం, రైళ్ల ద్వారా ఎలా తెచ్చుకోవాలన్న వివరాలను వెల్లడిస్తూ ఓ వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియోని చూసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు దానిని సుమోటాగా తీసుకొని కోటి యాదవ్పై కేసు నమోదు చేశారు. కోటి యాదవ్ నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 1968 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం నేరంగా పేర్కొంటూ కోటి యాదవ్పై కేసు పెట్టారు. విమానంలో పరిమితికి మించి మద్యం రవాణా చేశారని కోటి యాదవ్పై ఎక్సైజ్ పోలీసులు అభియోగం మోపారు.