Sunday, June 15, 2025

రక్షణ శాఖ భూములకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్ డబుల్ డెక్కర్ ఎలివేటేడ్ కారిడార్లు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. రక్షణ శాఖ భూముల బదలాయింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. జవహర్‌నగర్‌లోని 330 ఎకరాల హెచ్‌ఎండీఏ భూములను రక్షణ శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మహా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టింది.

సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు (సుమారు 18.124 కి.మీ.), ప్యారడైజ్ జంక్షన్ నుంచి మిలిటరీ డెయిరీ ఫామ్ వరకు (సుమారు 5.32 కి.మీ.) వరకు నేషనల్ హైవే-44పై ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు భవిష్యత్తులో మెట్రో రైలు మార్గం వచ్చే అవకాశం ఉంది. మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ఉత్తర జిల్లాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ రహిత, వేగవంతమైన ప్రయాణ మార్గం అందించేందుకు నిర్మిస్తున్నారు.

ఎట్టకేలకు… ఆరంభం
ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం అయిది. జవహర్‌నగర్‌లోని 330 ఎకరాల హెచ్‌ఎండీఏ భూములను రక్షణ శాఖకు బదలాయించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీనికి సంబంధించి సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వ స్థలాలతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతాల్లోని మొత్తం 138 ఎకరాల రక్షణ శాఖ భూములు అవసరం. ఈ భూముల విలువకు తగ్గట్టుగానే జవహర్‌నగర్‌లో భూమిని కేటాయించేందుకు హెచ్‌ఎండీఏ అంగీకరించింది. రక్షణ శాఖ అధికారులు భూములను పరిశీలించి సుముఖత వ్యక్తం చేయడంతో, త్వరలో ఎంవోయూ కుదుర్చుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.


ఇప్పటికే ఎన్‌హెచ్-44 డెయిరీ ఫాం వరకు నిర్మించే కారిడార్‌కు హెచ్‌ఎండీఏ టెండర్లు కేటాయించింది. భూముల బదలాయింపు పూర్తయిన వెంటనే ఎస్‌హెచ్-01 శామీర్‌పేట కారిడార్‌కు కూడా టెండర్లు పిలవనున్నారు. ఈ రెండు కారిడార్ల భూసేకరణ, ఇతర పనుల నేపథ్యంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి 596 అభ్యంతరాలు వచ్చాయి. అంతేకాకుండా, చెట్ల తొలగింపు వంటి సమస్యలపై 26 రిట్ పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. హెచ్‌ఎండీఏ వాటికి వివరణ ఇస్తూ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతోంది. రెండు కారిడార్లలో మొత్తం 10,593 చెట్లను గుర్తించారు. ఇందులో 4,230 వృక్షాలను ఇప్పటికే ట్రాన్స్‌లోకేట్ చేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధం చేసింది.

మరో 3,298 చెట్లను తొలగించనున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. రెండు ప్రాజెక్టులలో బేగంపేట విమానాశ్రయం వద్ద 600 మీటర్ల భూగర్భ టన్నెల్, హకీంపేట్ వద్ద మరో 550 మీటర్ల టన్నెల్ రానున్నాయి. వీటికి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి అనుమతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఉత్తర తెలంగాణ ప్రజలు ఎటువంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణాలు చేసేందుకు వీలు కలగనుంది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com