హైదరాబాద్ లో వచ్చిన భారీ వర్షఆలు, వరదలు చాలా వరకు సెప్టెంబర్లోనే సంభవిస్తున్నాయి. 1908వ సంవత్సరంలో భాగ్యనగరంలో ఉన్న మూసీ నది పొంగి పొర్లడమంతో నగరంలోని సగభాగం నీట మునిగిపోయిన ఘటన ఇంకా మరువలేకపోతున్నారు. ఆ వరదలు కూడా సెప్టెంబర్ నెలలోనే వచ్చాయని గుర్తుచేసుకుంటున్నారు. సెప్టెంబరు 28వ తేదీ ఒక పీడ కలగా దాని ఆనవాళ్లు ఇప్పటికి భయపెడుతూనే ఉంటాయి. మూసీ నది ఏకంగా 60 అడుగుల ఎత్తున ప్రవహించి ఉగ్రరూపం దాల్చింది. 36 గంటల్లో 16 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. మూసీ ప్రవాహం చాదర్ ఘాట్ దాటి అంబర్పేట బుర్జు వరకు, అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు వరద పోటెత్తింది. ప్రాణాలు కాపాడుకునేందుకు వందల సంఖ్యలో ప్రజలు పేట్ల బుర్జుపైకి ఎక్కారు. కానీ మూసీనది ఉద్ధృతికి పేట్లబుర్జు సైతం కొట్టుకుపోయి వరదలో కలిసిపోయారు.
1591 నుంచి 1908 వరకు మొత్తం 14 సార్లు హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. 1631, 1831, 1903 సంవత్సరాల్లో భారీ వరదలతో హైదరాబాద్ తల్లడిల్లిపోయింది. ఆ వరదలు పెద్ద ఎత్తున ధన నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. 1908 సెప్టెంబరులో ముంచెత్తిన వరదల్లో హైదరాబాద్ నగరంలోని ఏకంగా 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి. మూసీ వరదల్లో మొత్తం 15 వేల మంది చనిపోగా, 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ విషాదకరమైన ఘటన ఇప్పటికీ హైదరాబాద్ చరిత్రలో ఓ భయంకరమైన అనుభవమేనని చెప్పకతప్పదు. అంతకు ముందు 1903లో సెప్టెంబర్ నెలలోనే కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది. ఇలా 1968, 1984, 2000, 2007, 2016, 2020 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలు కురిసి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు ఎప్పుడు కురిసినా సెప్టెంబర్లో వచ్చిన వర్షాలే బీభత్సం సృష్టిస్తుండటమే భాగ్యనగరవాసుల భయానికి కారణమని చెప్పవచ్చు.