రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారమందిస్తాం..
హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు నిర్ణయం
మూసీని నగరానికి వరంలా తీర్చిద్దుతాం..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బిల్డర్స్, డెవలపర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని, వారు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, వారికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైదరాబాద్ నోవాటేలో జరిగిన తెలంగాణ బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బిల్డర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసి బిల్డర్స్, డెవలపర్స్ ను ఇబ్బంది పెట్టే పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బిల్డర్స్కు హైదరాబాద్ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఒక యువ రాష్ట్రం, ప్రపంచ పటంలో రైజింగ్ గా కనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతుందని తెలిపారు. నెట్ జీరో సిటీ ఒప్పందం చేసుకొని హైదరాబాద్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుందన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దిల్లీ ప్రజలు స్థానికంగా ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఒక సీజన్లో అక్కడి నుంచి పౌరులు వలస వెళ్లి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.. ఆ దుస్థితి హైదరాబాద్ కు రాకుండా ఉండేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని డీజిల్ వాహనాలను దశలవారీ ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తున్నట్టు తెలిపారు.
Also Read: Top 10 skyscrapers of Hyderabad..!
ముసీ పునరుజ్జీవం చరిత్రలో మైలురాయి
మూసీ పునరుజ్జీవం రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయి అని భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్ద కాలంగా కాలుష్య కాసారంతో ప్రజలు జీవించడానికి ఇబ్బంది పడుతున్నారు.. ఈ నదిలో పరిశుభ్రమైన నీరు పారించి.. మూసీని హైదరాబాద్ ఒక వరంలా మారుస్తాము, హైదరాబాద్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుదాం అన్నారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత ఖర్చు అయినా ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడులకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్లో పర్యటించి 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారని వివరించారు. 2029-30 కి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త విద్యుత్ పాలసీలో స్పష్టం చేశామని, 35 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు తెలిపారు. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపించేందుకు కేవలం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరానికి ఒక ఏడాదిలో పదివేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం హైదరాబాదును ఉన్నత స్థానానికి తీసుకువెళ్లిందని తెలిపారు.