టీఎస్ న్యూస్, హైదరాబాద్: అతనో జడ్జీ.. అనేక కేసుల్లో బాధితులకు ఊరట కలిగించేలా తీర్పునిచ్చిన ఆయన.. తనకు మాత్రం ఉరిశిక్షను విధించుకున్నాడు. హైదరాబాద్లోని అంబర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బాగ్ అంబర్పేట పోచమ్మ బస్తీ శ్రీనిధి రెసిడెన్సి ఫ్లాట్ నెంబర్ 402 లో నివాసం ఉంటున్న ఏ. మణికంఠ (36) నాంపల్లి కోర్టులో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా (ఎక్సైజ్) విధులు నిర్వహిస్తున్నారు. మణికంఠ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. బాగ్ అంబర్పేట పోచమ్మ బస్తీకి చెందిన అందె శ్రీశైలం కుమారుడు అందె మణికంఠ (36) కు ఏడేండ్ల క్రితం మహబూబ్ నగర్కు చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు. నాలుగేండ్ల పాటు ఆలేరు కోర్టులో జూనియర్ న్యాయమూర్తిగా పని చేసిన మణికంఠ.. మూడేండ్లుగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని ఎక్సైజ్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రెండేండ్ల క్రితం అక్కడే ఇందిరా శ్రీనిధి రెసిడెన్సీలో ఫ్లాటు కొన్న మణికంఠ కుటుంబంతో అక్కడే నివాసముంటున్నారు. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో ఇటీవల ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మరోవైపు మణికంఠ తల్లి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భార్యాభర్తల మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ.. మణికంఠ ఫోన్ పెట్టేశారు. అనంతరం పడక గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నారు. ఆయన తండ్రి శ్రీశైలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.