- 2054 అవసరాలకు అనుగుణంగా సమగ్ర మొబిలిటీ ప్రణాళిక
- అధ్యయనాన్ని ప్రారంభించిన ఉమ్టా
- ఓ సంస్థకు సర్వే బాధ్యతలు
నగరం నలుమూలాల శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ఉండేందుకు ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను పట్టాలెక్కించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మెట్రో రైలు తరహాలో కాలుష్య రహితంగా ఉండే రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం సంకల్పించింది. దానికి అనుగుణంగానే మహానగరాన్ని దాని శివారు ప్రాంతాల్లో సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళికను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) చర్యలు చేపడుతోంది. విదేశాలను తలపించేలా ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలన్నది ప్రభుత్వం సంకల్పం.
దానికి అనుగుణంగానే మహానగరాన్ని దాని శివారు ప్రాంతాల్లో సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళికను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హెచ్ఎండిఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. తద్వారా శివారు ప్రాంతాల్లో పట్టణీకరణకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని హెచ్ఎండిఏ భావిస్తోంది. ఇందుకోసం హెచ్ఎండిఏ పరిధిలో పనిచేస్తున్న యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ఫోర్టేషన్ అథారిటీ (ఉమ్టా) ఎప్పటికప్పుడు గ్రేటర్తో పాటు శివారు ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థలపై అధ్యయనం చేస్తూ, భవిష్యత్లో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 2054 అవసరాలకు అనుగుణంగా నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెరుగైన రవాణా అందించేలా ఉమ్టా కసరత్తు ప్రారంభించింది.
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా..
హెచ్ఎండిఏ ఏరియా పరిధిలో వివిధ రకాల రవాణా వ్యవస్థను సమన్వయం చేయడం, వాటి పనితీరును సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉమ్టా పనిచేస్తోంది. భవిష్యత్ మహానగరాలకు కావాల్సింది అన్ని అంశాలతో కూడిన ప్రణా ళికాబద్ధమైన పట్టణీకరణ లక్ష్యంతో ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పనిచేస్తోంది. టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్, అర్భన్ ఫారెస్ట్, లేక్ ప్రొటెక్షన్, అర్భన్ ట్రాన్స్ఫొర్టేషన్ ఇలా వివిధ విభాగాలు హెచ్ఎండిఏ పరిధిలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ట్రాఫిక్కు చెక్ పెట్టేలా ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది.
కసరత్తు మొదలు పెట్టిన ఉమ్టా…
ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థలో రోడ్డు, రైలు, మెట్రో మార్గాలతో పాటు అభివృద్ధి చెందిన నగరాల్లో ఉన్న పట్టణ ప్రజా రవాణా వ్యవస్థలను అధ్యయనం చేయడం, వాటిని నగరంలో ఏ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకు రావాలన్న దానిపై ఉమ్టా కసరత్తు మొదలు పెట్టింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల వరకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటేనే నగరం మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్ఎండిఏ కార్యాచరణను రూపొందించే పనిలో పడింది. దీనికోసం రహదారుల విస్తరణే కాకుండా అన్ని రకాల చర్యలను చేపడుతోంది.
ఐటీ కారిడార్లో రోజు రోజుకు పెరుగుతున్న రద్దీ…
2031లో రూపొందించిన హెచ్ఎండిఏ మాస్టర్ప్లాన్కు అనుగుణంగా ఉన్న రోడ్ల విస్తరణే కాకుండా కొత్తగా జన సాంద్రత ఉన్న ప్రాంతాలు, భవిష్యత్లో అభివృద్ధి చెందే ప్రాంతాలను పరిగణలోకి ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఉమ్టా అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగా 2054 అవసరాల అనుగుణంగా నగరం ఔటర్ రింగ్ రోడ్డును హద్దుగా చేసుకొని విస్తరిస్తున్న నేపథ్యంలో సమగ్ర మొబిలిటీ ప్లాన్ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏలోని ఉమ్టా విభాగం ఆధ్వర్యంలో ఈ ప్లాన్ రూపకల్పన కోసం ‘లీ అసోసియేట్’ను కన్సల్టెన్సీగా నియమించి సర్వే ప్రారంభించింది. ఈ సర్వేలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు విస్తరిస్తున్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్పై పూర్తిగా అధ్యయనం చేయనున్నారు.
దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను అధ్యయనం చేయడంతో పాటు వాటికన్నా మరింత మెరుగైన పట్టణ ప్రజా రవాణా వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో ఉమ్టా నిమగ్నమై ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో రోజు రోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి అనుగుణంగా అత్యాధునిక శైలిలో ఉండేలా, సులభంగా, పర్యావరణ హితంగా ఉండేలా వాహనదారులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఉమ్టా కార్యాచరణను సిద్ధం చేసింది. బస్సు, మెట్రో, ఎంఎంటిఎస్ ఇలా ప్రజా రవాణాను వినియోగించుకునే వారికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ‘లీ అసోసియేట్’ తగిన సూచనలను చేయనుంది. మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టేందుకు తగిన ప్రణాళికను ఈ సంస్థ అందజేయనుంది. ఈ సర్వేను పూర్తిస్థాయిలో నిర్వహించి ఏడాదిలో సమగ్ర నివేదికను ఈ సంస్థ అందజేయనుంది.