ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తున్న యువతీ, యువకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. పలువురు విద్యార్థులు ప్రమాదాల్లో మరణించడం, మరికొందరిపై దాడులు జరగడం.. ఇంకొందరు అదృశ్యమవడం.. ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబాలు.. మనోవేదనకు గురవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగు విద్యార్థుల మరణాలు, అదృశ్య ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన యువతి అదృశ్యమైంది. హైదరాబాద్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువతి నితిషా కందుల అమెరికాలో అదృశ్యమైంది. నితీషా కందుల కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. ఆమె మే 28, 2024 నుంచి అమెరికాలో అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నితీషా కందుల కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి కనిపించకుండా పోయిందని, ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు.
కాగా.. ఈ ఘటనకు ముందు అమెరికా చికాగోలో 25 ఏళ్ల తెలంగాణ విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అనే విద్యార్థి కూడా అదృశ్యమయ్యాడు. చంద్ర విస్కాన్సిన్లోని కాంకోర్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. దీనికి ముందు అమెరికాలోని క్లీవ్ల్యాండ్ నగరంలో 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అదృశ్యమయ్యాడు. అనంతరం శవమై కనిపించాడు.అదృశ్యమవుతున్న ఘటనలే కాకుండా రోడ్డు ప్రమాదాల్లో కూడా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది బిజినెస్ అనాలిసిస్ లో మాస్టర్స్ చేస్తున్న 24 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని ప్రతీక్షా కున్వర్ అమెరికాలోని కాన్సాస్లోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది.