ఇకపై రాంగ్ రూట్లో వెళ్తే డైరెక్ట్ గా జైలుకే
హైదరాబాద్ లో కఠినంగా ట్రాఫిక్ రూల్స్
హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ తో పాటు ప్రమాదాలను ను నివారించేందుకు పోలీసులు అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు కూడా పెడుతున్నా, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు విధించినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు వాహనదారులు మాత్రం ఏమాత్రం ట్రాఫిక్ నిబంధనలు పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా రాంగ్ రూట్లలో వెళ్లే వారి వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
అందుకే ఇకపై ట్రాఫిక్ నిబంధనల విషయంలో మరింత కఠినంగా వ్యవహించాలని సైబదాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. అంతే కాదు అప్పుడే యాక్షన్ లోకి సైతం దిగారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు, రాంగ్ రూట్లో వాహనాలు నడిపేవారిని ఫైన్ తో సరిపెట్టకుండా డైరెక్టుగా జైలుకు పంపించేందుకు రేడీ అయ్యారు. రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై 336 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. రాంగ్ రూట్లో వచ్చి పట్టుబడిన వాహనదారులపై ట్రాఫిక్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే కాకుండా చార్జిషీట్ కూడా ఫైల్ చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ సిటీ లో శుక్రవారం రోజు సైబరాబాద్ కమిషనరేట్ జోన్లో రాంగ్ రూట్ లో వాహనాలు నడిపిన 93 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అందుకే ఇకపై రాంగ్ రూట్ లో వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ఎందుకంటే పోలీసులకు పట్టుబడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. అందుకే జాగ్రత్త సుమా.