హైదరాబాద్లోని రాంనగర్ ఎస్బీఐ బ్రాంచ్లో భారీ గోల్డ్ కుంభకోణం జరిగింది. సరైన పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల విలువ చేసే బంగారు రుణాలు ఇచ్చిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్లో భారీ గోల్డ్ కుంభకోణం బయటపడింది. ఈ ఘటనలో ఉద్యోగులే దొంగలయ్యారు. ఏకంగా రూ.2 కోట్ల విలువ చేసే బంగారు రుణాలు మంజూరు చేశారు. సరైన పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చిన ఇద్దరు ఎస్బీఐ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్డీతో కలిసి సుమారు రూ.2.2 కోట్ల వరకు మేరకు మోసానికి పాల్పడినట్లు పోలీసులు విచారణాలో తేలింది. ఈ దారుణం హైదరాబాద్లోని రాంనగర్ ఎస్బీఐ బ్రాంచ్లో చోటు చేసుకుంది. మేనేజర్ డి.సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేయటంలో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు ఉద్యోగులతోపాటు మరో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోలేదు
గుగ్లోత్ జైరాం నాయక్ చెల్లుబాటయ్యే పూచీకత్తు లేకుండా, బ్యాంకు విధానాలను ఉల్లంఘించి ఈ రుణాలను ప్రాసెస్ చేశాడు. క్యాష్ ఆపరేషన్స్ ఇన్ఛార్జిగా ఉన్నా బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోకుండా దుర్వినియోగం చేశాడు. ఈ మోసంతో రూ.2.2 కోట్లను అక్రమంగా పోగు చేశాడు. ఈ నిధులను వివిధ వ్యక్తిగత ఖాతాలకు, ఎల్లారెడ్డిగూడలోని ఓ ప్రైవేటు సంస్థకు నిధులు మళ్లించారని మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వడ్డీతో సహా రూ.2.2 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు లిఖితపూర్వక వాంగ్మూలంలో నాయక్ అంగీకరించారు. ఈ ఫిర్యాదుపై సీసీఎస్ (హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్)లో నిందితులపై సెక్షన్ 316(5), 318(4) కింద కేసు నమోదు చేశారు. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఈ మోసం తాజాగా జరిగిన ఆడిట్లో వెలుగులోకి రావటం గమనార్హం. ప్రధాన నిందితుడు నాయక్, రుతు పవన్ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల పాత్రను సీసీఎస్ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు.