త్వరలోనే నల్లమల డిక్లరేషన్ : సీఎం రేవంత్ రెడ్డి
తాను పాలమూరు బిడ్డనని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదన్నారు. పాలమూరు బిడ్డల కష్టంతో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అదర్శంగా నిలబెడుతానని ఆ రోజే మాట ఇచ్చాను. మీరు ప్రణాళికలు వేయండి నిధులు ఇచ్చే బాధ్యత నాది అన్నారు. గిరిజనులకు అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్దని రేవంత్ అన్నారు. గిరిజనులను అత్మగౌరవంతో బతికేలా చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి రూ.60వేల కోట్లు రైతుల కోసం ఖర్చుపెట్టామని సీఎం వివరించారు. వరి వేస్తే ఉరే అన్న దొర తను మాత్రం వందల ఎకరాల్లో వరి వేసుకున్నాడన్నారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మహిళా సంఘాలకుపెట్రోల్ బంకులు ఇస్తు్న్నామన్నారు.
మీరు వరివేస్తే మేము బోనస్ ఇస్తామంటున్నామని రేవంత్ అన్నారు. పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినేది కాదన్నారు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యత్ ఇస్తున్నామని రేవంత్ గుర్తు చేశారు. గత పదేళ్లలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, మేము ఇస్తే నోటిఫికేషన్లు రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్నారన్నారు. మేము ఏడాదిన్నరలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించడంలో మనమే నెంబర్ వన్ కేంద్రం చెప్పిందన్నారు. శాంతిభద్రతల్లో, ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.
నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్రాబాద్ మండలంలోని మాచారంలో ఆయన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో బీడు వారుతున్న పోడు భూములకు జలకళను తెచ్చేందుకే సర్కార్ ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రవేశ పెట్టిందని మంత్రులు గుర్తు చేశారు.