సీనియర్ అధికారి స్మితాకు పోలీసుల నోటీసులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్కి రాష్ట్ర పోలీసుల నుంచి నోటీసు అందింది. దీనికి కారణం స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమాల్లో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన చిత్రం షేర్ చేయడమే. ఈ చిత్రం మార్చి 31న ‘సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్ వద్ద బుల్డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లి స్టైల్లో రూపొందిచినట్లుగా ఉంది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని చిత్రంలో చూపించారు. ఈ విషయమై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహ్మద్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ.. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 179 ప్రకారం స్మితా సబర్వాల్కు నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. అయితే, నోటీసులో పేర్కొన్న విషయాలను ఇప్పుడే బయటపెట్టలేమని స్పష్టం చేశారు. సెక్షన్ 179 ప్రకారం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి, సంబంధిత వ్యక్తులను స్టేట్మెంట్ ఇవ్వాలంటూ స్టేషన్కు హాజరయ్యేలా పిలిచే అధికారం కలిగి ఉంటాడు.
ఈ నిబంధనల ఆధారంగానే స్మితాకు నోటీసు పంపినట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజా చైతన్యాన్ని కలిగించే భాగంలో ఉన్న ఒక అధికారికి నోటీసు రావడం పట్ల అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐ చిత్రాన్ని షేర్ చేయడం వల్ల నేరపూరిత చర్యలకు దిగడమేంటన్న ప్రశ్నలు కూడా తెరపైకి వొచ్చాయి.