లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని మాజీ ఎంపి వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీని దేవుడు పంపిన దేవదూత అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ కన్యకుమారిలో ధ్యానం చేస్తాననంటున్నాడని విహెచ్ ఎద్దేవా చేశారు. మతాలనే విడదీసే మోడీకి మూడు రోజుల ధ్యానం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. గురువారం విహెచ్ విలేకరులతో మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోడీ రైతులు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐఐటీ ఐఐఎం రిజరేషన్లు తెచ్చింది కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా కులగణన చేపడుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. నయీం డైరీ ఎక్కడికి పోయిందని విహెచ్ ప్రశ్నించారు. బ్రిటీష్ కాలంలో తెచ్చిన చట్టాల్లో మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక జ్యుడీషియల్ రిమాండ్ను 14 రోజుల కంటే ఎక్కువ పెంచాలని ఆయన అన్నారు. అయితే నల్సార్ వర్సిటీ విసి సూచించిన చట్టాలను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.