కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
అమెరికా నుంచి వచ్చిన విజ్ఞప్తి భారత్ కు పెరిగిన పరపతిని తెలియజేస్తుందని, తద్వారా ఇండియా త్వరలోనే గ్లోబల్ సూపర్ పవర్ గా అవతరించనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దానికి స్వస్థి పలికేందుకు ఇండియా చొరవ తీసుకోవాలని అమెరికా చేసిన అభ్యర్ధనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రిక్వెస్ట్ కు సంబందించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై కిషన్ రెడ్డి గత 2 ఏళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు చొరవతీసుకోవాలని భారతదేశానికి అమెరికా విజ్ఞప్తి చేసిందని, అమెరికా నుంచి వచ్చిన ఈ విజ్ఞపి భారత్- రష్యా మధ్య ఉన్న బలమైన బంధాన్ని, అంతర్జాతీయంగా భారత్ కు పెరిగిన పరపతిని తెలియజేస్తుందని అన్నారు.
అలాగే గత 10 ఏళ్లలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో భారతదేశం రాజకీయంగా, ఆర్థికంగా, మౌలిక సదుపాయాల కల్పనలో, అంతరిక్షరంగంలో, రక్షణ, దౌత్య రంగాల్లో ఇలా ప్రతి రంగంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్పారు. తద్వారా త్వరలోనే ఇండియా గ్లోబల్ సూపర్ పవర్ గా అవతరించనుందని కిషన్ రెడ్డి తెలిపారు.
కాగా అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ భారత్ తో రష్యాకు బలమైన బంధం ఉందని, దీనిని ఉపయోగించుకుని రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్దాన్ని ముగించేందుకు భారత్ కృషి చేయాలని కోరారు. అలాగే రష్యాతో ఉన్న సుదీర్ఘ బంధానికి అనుగుణంగా పుతిన్ తో మాట్లాడాలని, కీవ్ పై జరుగుతున్న చట్టవిరుద్దమైన యుద్దానికి స్వస్థి పలికేలా చర్యలు తీసుకోవాలని భారత్ ను కోరారు.