ఇంటర్పోల్ చేతికి ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసులు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు విదేశాల్లో విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు విదేశాల నుంచి రప్పించేందుకు ముందడుగు పడింది. ఇంటర్ పోల్ నుంచి విదేశాలకు రెడ్ కార్నర్ నోటీసులు అందనున్నాయి. సీబీఐ జారీ చేసిన నోటీసులతో 196 దేశాల ప్రతినిధులను ఇంటర్ పోల్ అప్రమత్తం చేయనుంది. దీంతో సీబీఐ వారికి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్కు సిఫారసు చేయడంతో విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సంతృప్తి చెందిన సీబీఐ.. ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని కోరింది.
బెల్జియంలో శ్రవణ్రావు.. కెనడాలో ప్రభాకర్రావు
ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఆ దేశం వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్రావు, కెనడాలో ప్రభాకర్రావు తలదాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నిందితులను హైదారాబాద్ తీసుకొచ్చే ఆలోచనలో తెలంగాణ పోలీసులు ఉన్నారు. రేపో మాపో వీరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసు గురించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిందితులు తమ వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇద్దరి నిందితుల చుట్టూ ఉచ్చు బిగిస్తుందని తెలుసుకున్న వీరు, అమెరికా నుంచి మకాం మార్చినట్టు వార్తలు వస్తున్నాయి.
కాగా, సీబీఐ పంపిన రెడ్ కార్నర్ నోటీసులను ఇంటర్ పోల్ అధికారులు పరిశీలించారు. ఎందుకంటే ఇంటర్పోల్ ఏజెన్సీ ప్రతినిధులు 196 దేశాల ఇమ్మిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేశారు. సీబీఐ అందించిన వివరాలను ఇంటర్ పోల్ అధికారులు వాటిని ఆయా ఆదేశాలను పంపినట్టు సమాచారం. నిందితులు ఏ దేశం పౌరసత్వం ఉన్నప్పటికీ, వారిని అరెస్టు చేసి విచారించే అధికారం ఇంటర్పోల్కు ఉందని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే వీరిద్దర్నీ ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, శ్రవణ్రావులు. హైదరాబాద్ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఏదో ఒక కుంటి సాకు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. అనారోగ్యం వల్ల అమెరికాలో ఉంటున్నానని మొన్నటివరకు సాకులు చెప్పారు ప్రభాకర్రావు. ఇక శ్రవణ్రావు అయితే అమెరికా నుంచి దుబాయ్కి చక్కర్లు కొడుతున్నట్లు ఆ మధ్య కొందరు రాజకీయ నేతలు ఓపెన్గా చెప్పుకొచ్చారు. వీరు చిక్కితే ట్యాపింగ్ కేసు లోగుట్టు బయటపడడం ఖాయమన్నమాట.