శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. అమెరికాపై ఆగ్రహంతో అలా కలిసిపోయిన పుతిన్, కిమ్.. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. విందు భోజనాలు, కారులో షికార్లు, రిటర్న్ గిఫ్ట్లు.. ఒకటేంటి ఇద్దరూ చాలా దూరం వెళ్లిపోయారు. దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. మిలటరీ ఒప్పందాలతో వెస్ట్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఉక్రెయిన్పై సుదీర్ఘ యుద్ధం చేస్తున్న రష్యా.. ఆయుధాల కోసం ఉత్తర కొరియా తలుపు తట్టింది. పశ్చిమ దేశాలపై కయ్యానికి కాలు దువ్వే కిమ్ జోంగ్ ఉన్.. పుతిన్కు సాయం చేయడానికి ముందుకొచ్చారు. అంతే రెండు దేశాల మధ్య మైత్రీ బంధం బలపడింది. ఆ మధ్య కిమ్ మాస్కోలో పర్యటించి వస్తే.. 24 ఏళ్ల తర్వాత ప్యాంగ్యాంగ్లో అడుగుపెట్టారు రష్యా అధ్యక్షుడు. తమ దేశానికి వచ్చిన పుతిన్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కిమ్. అదేంటో తెలుసా..? పంగ్సన్ అనే వేటాడే శునకాలు.
పంగ్సన్ జాతి కుక్కలు ఉత్తర కొరియాలోని ఉత్తర భాగంలో మాత్రమే కనిపిస్తుంటాయి. వేటాటడంలో వీటికి తిరుగులేదంటారు. క్షణాల్లో మనిషిని చంపేయగలవని చెబుతారు. అలాంటి మేలు జాతి శునకాలను పుతిన్కు బహుకరించారు కిమ్. ఉత్తర కొరియా మీడియా సంస్థ కేసీఎన్ఏ ఈ విషయాన్ని వెల్లడించింది. పుతిన్, కిమ్ కలిసి తెల్లటి శునకాలను చూస్తున్న వీడియోను ప్రసారం చేసింది. పుతిన్కు డాగ్స్ అంటే చాలా ఇష్టం. గతంలో కొందరు దేశాధ్యక్షులు ఆయనకు అరుదైన కుక్కలను బహూకరించిన సందర్భాలున్నాయి.
ఇక పుతిన్ కూడా కిమ్కు రెండో ఆరుస్ లిమోసిన్ కారును గిఫ్ట్గా అందించారు. ఇద్దరు దేశాధినేతలు ఆ కారులో కొద్దిసేపు షికారు చేశారు. ఆరుస్ కారు రెట్రో స్టైల్లో తయారు చేసిన సోవియట్ కాలం నాటి జిల్ లిమోసిన్. ఇది రష్యా అధ్యక్షుడి కాన్వాయ్లోనూ ఉంటుంది. ఇక కిమ్కు కార్లపై విపరీతమైన వ్యామోహం. ఆయన వద్ద బెంజ్, రోల్స్రోయిస్ ఫాంథమ్, లెక్సస్ SUV వంటి లగ్జరీ వెహికల్స్ ఉన్నాయి. ఫిబ్రవరిలో క్రెమ్లిన్ నుంచి ఒక లిమోసిన్ను ప్యాంగ్యాంగ్కు పంపారు పుతిన్. ఇప్పుడు రెండోది స్వయంగా అందజేశారు. పుతిన్ పర్యటన సందర్భంగా రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలకమైన మిలటరీ ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాలు కలిసి ఆయుధాలు తయారుచేసేందుకు సిద్ధమవుతున్నాయన్న వార్తలు బయటకొచ్చాయి.
ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు కిమ్. తమ పాలసీలకు సపోర్ట్ చేసినందుకు కిమ్కు ధన్యవాదాలు తెలిపారు పుతిన్. ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే, అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి.. అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పశ్చిమ దేశాలు.