కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం బోఫోర్స్, 2జీ, బొగ్గు కుంభకోణం వంటి ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులోనూ వేలకోట్లు కొల్లగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధులు నేషనల్ హెరాల్డ్ ను స్థాపించుకున్నారని, కానీ దొడ్డిదారిన ఈ పత్రిక ద్వారా రాహుల్, సోనియా గాంధీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ ఆస్తులను బదలాయించుకుంటున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. దీనిపై విచారణ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీకి చట్టంమీద విశ్వాసం ఉంటే ఈ విధంగా ధర్నాలు చేయరని అన్నారు. నెహ్రూ కుటుంబానికి, దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనే ఉద్దేశం లేదు. బోఫోర్స్ కుంభకోణం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే. రాజకీయ వ్యవస్థలను, దేశ రాజ్యాంగ బద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడం, దేశాన్ని అవినీతి మయంగా మార్చడం కాంగ్రెస్ చేసింది. ఈ కేసు ఇవాళ వొచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 2012 నవంబర్ 1వ తేదీన.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. సుబ్రమణ్యస్వామి దిల్లీ కోర్టులో కేసు వేశారు.
అందులో చాలా స్పష్టంగా.. సోనియా, రాహుల్ పైన.. యూపీయే హయాంలోనే.. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి మళ్లించుకున్నారు అని చాలా స్పష్టంగా దాఖలు చేశారని తెలిపారు. ఇది పత్రికకు సంబంధించిన ఆస్తులు. కాంగ్రెస్ పార్టీ.. ఈ పత్రికకు.. 90 కోట్ల రుణం ఇస్తే.. దాన్ని.. 50 లక్షల రూపాయల కోసం మళ్లీ రియల్ ఎస్టేట్ కంపెనీకి దారిమళ్లించారు. దీనికి సోనియా, రాహుల్ నేతృత్వం వహిస్తున్న కంపెనీ ఎలా వీటిని స్వాధీనం చేసుకుందో కోర్టులో సుబ్రమణ్యస్వామి వివరించారు. ఈ కేసును కొట్టేయాలని రాహుల్, సోనియా హైకోర్టుకు వెళ్తే.. కోర్టు కొట్టేసింది. దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. 2016లో సుప్రీంకోర్టు కూడా సోనియా, రాహుల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
మోదీ ప్రధాని అయ్యాకే ఈ కేసులు బయటకు వొచ్చినట్లు.. సోనియా, రాహుల్, కాంగ్రెస్ నేతలను సుద్దపూసలు అయినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉల్టాచోర్.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ధర్నాలు చేస్తోంది. సోనియా, రాహుల్ గాంధీ.. చట్టానికి వ్యతిరేకంగా, ఆస్తులను దారిమళ్లించుకుంటే మీకు భయపడి కేసులు విత్ డ్రా చేసుకోవాలా? కోర్టుల పరిధిలోకి వెళ్లిన అంశం కేంద్రం చేతుల్లోనో.. దర్యాప్తు సంస్థల చేతుల్లోనే ఉండదు. కోర్టుకు, ఈడీకి సహకరించాల్సింది పోయి.. దబాయించేందుకు ప్రయత్నించడం సరికాదు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని కిషన్ రెడ్డి హితువు పలికారు. . బొగ్గు కుంభకోణం, 2జీ స్కామ, బోఫోర్స్ స్కామ్, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణాన్ని.. కాంగ్రెస్ చేసిన అవినీతిని మరిచిపోలేదని అన్నారు.
అర్ధరాత్రి చెట్లను నరికిన ఘటనలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేవు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన.. దుందుడుకు చర్యలను, తప్పును ఒప్పుకుని కోర్టు ముందు వితండవాదాలు చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితువు పలికారు. అబద్ధాలు మాట్లాడకుండా ఆ భూమిలో సుప్రీంకోర్టు చెప్పినట్లు అక్కడ మొక్కలను నాటే పని చేపడితే బాగుంటుందన్నారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లను నరికిన ఘటనలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేవని అన్నారు. పోలీసు బందోబస్తు పెట్టి వంద ఎకరాల్లో చెట్లు నరకడం.. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పిందో.. ప్రధానమంత్రి కూడా ఇదే మాట చెప్పారు. చెట్లు నరకడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. బీజేపీ తరపున ఈ విషయంలో అన్ని రకాలుగా ప్రయత్నించాం.. విద్యార్థులకు అండగా నిలిచాం. యువమోర్చా, మహిళా మోర్చా కార్యకర్తలు ఉద్యమాలు చేశారు. జైలు పాలయ్యారు. వాల్టా చట్టం కింద చెట్టు నరకాలన్నా సర్కారరు అనుమతి తీసుకోవాలి. వంద ఎకరాల్లో చెట్లు నరికేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు. వాల్టా యాక్ట్ కింద ఏరకమైన చర్యలు తీసుకున్నారు. భూములు అమ్ముతున్నరా లేదా? ఉపాధికల్పన జరుగుతున్నదా అనేది కాదు. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని అన్నారు.