అంతుచిక్కని రహస్యంగా జగన్నాధ ఆలయం
ప్రపంచంలో ఇప్పటీకీ సైన్స్ కు అందని రహస్యాలెన్నో ఉన్నాయి. వాటిని ఛేదించేందుకు ఎంత ప్రయత్నించినా అంతుచిక్కని మిస్టరీలకు అంతులేదు. అదిగో అలాంటి వాటిలో ఉత్తరప్రదేశ్ లోని జగన్నాథ్ ఆలయం ఒకటి. ఇది కాన్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెహతా అనే గ్రామంలో ఉంది. ఈవర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేయడం దేవాలయం ప్రత్యేకత. ఏ సంవత్సరంలో ఎంత మేర వర్షం కురుస్తుందో అంచనా వేస్తుంది ఈ ఆలయం. అందుకనే ఈ జగన్నాధ్ ఆలయాన్ని మాన్ సూన్ టెంపుల్ అని సైతం పిలుస్తుంటారు.
రుతుపవనాల రాకతో పాటు వర్షాలు కురవడానికి కొన్ని రోజుల ముందు ఈ ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం మొదలవుతుంది. ఇలా గర్భ గుడి పై కప్పు నుంచి జారే చుక్కలు వాన చినుకుల ఆకారంలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ చుక్కల సైజును బట్టి ఆ సంవత్సరం రుతుపవనాలు బలంగా ఉండి ఎక్కువగా వర్షాలు కురుస్తాయో లేక బలహీనంగా ఉండి తక్కువ వర్షాలు కురవనున్నాయో అంచనా వేస్తున్నారు.
ప్రతి యేటా జూన్ మొదటి పదిహేను రోజుల్లో గుడిపై కప్పు నుంచి చుక్కలు పడటం మొదలవుతుందని దేవాలయ పూజారి కుధా ప్రసాద్ శుక్లా చెప్పారు. ప్రస్తుతం గుడి గోపురం మీద ఉన్న రాయి నుంచి ఎక్కువ పరిమాణంలో చుక్కలు పడుతున్నాయని, ఈ చుక్కలు నాలుగైదు రోజుల క్రితం వరకు ఎక్కువగానే ఉన్నాయని ఆయన తెలిపారు. క్రింత ఉన్న బండపై పడిన నీటి చుక్కలు ఆరిన వెంటనే వర్షం కురుస్తుందట. ఈ సంవత్సరం బండ పై పడిన నీటి చుక్కలు ఇంకా ఆరిపోలేదని చెప్పిన పూజారి.. క్రమంగా నీటి చుక్కలు ఆరిపోతాయని చెప్పుకొచ్చారు.
ఈ చుక్కలను బట్టి రుతుపవనాల రాకలో కొంత మేర ఆలస్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐతే చుక్కల పరిమాణం బట్టి ఈ సంవత్సరం మంచి రుతుపవనాలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. సుమారు 15 అడుగుల ఎత్తులో నల్ల రాతితో చేసిన జగన్నాథుని విగ్రహంతో పాటు సుభద్ర, బలరామ విగ్రహాలు ఉన్నాయి. ఈ జగన్నాధ గుడి రహస్యంపై శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.