ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు అంటారు. కన్న బిడ్డల కోసం తల్లి ఏమి చేయడానికైనా సిద్ధపడుతుంది. నవమాసాలు మోసి బిడ్డను కనడం అమ్మకు మరో జన్మలాంటిది. బిడ్డల ప్రాణం ప్రమాదంలో ఉందంటే తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు ఏ తల్లైనా సరే. తల్లి తన కొన ఊపరికి ఉన్నంత వరకు తమ బిడ్డల కోసం పాటు పడుతూనే ఉంటారు. మరి అలాంటిది ఈ మధ్య కొంతమంది ఈ విషయాల్లో కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తమ బిడ్డల పాలిట యమపాశాలుగా మారుతున్నారు. ఈ మధ్య హింసాత్మక వీడియోలెన్నో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జగిత్యాల్ పట్టణంలో ఒక మహిళ తన మూడేళ్ల కొడుకును విచక్షణారహితంగా కొడుతున్న వీడియో వైరల్గా మారి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆ మహిళ క్రమం తప్పకుండా ఆ పిల్లవాడిని కొడుతుందని స్థానికులు చెబుతున్నారు. సోమవారం స్థానికులు ఆమె చర్యను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తులసినగర్ నివాసి శ్రీపెల్లి రమ తన కొడుకును కొడుతూ, కాలితో కూడా తన్నే దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఆమె ప్రతిరోజూ ఆ బాలుడిని కొడుతుండగా, స్థానికులు ఆమె చర్యను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి పోలీసులను ఆశ్రయించారు. ఈ మధ్యనే దుబాయ్ నుంచి ఆమె భర్త ఆంజనేయులు ఇంటికి వచ్చారు. వీరిద్దరి మధ్య తరచూ ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉండేవి. దీన్ని మనసులో పెట్టుకుని కొడుకుని గొడ్డును బాదినట్లు బాదేది. ఇదే ఘటనను స్థానికులు వీడియో తీసి సఖి సెంటర్కు ఇవ్వగా పోలీసులు భార్య, భర్తలను మందలించి పిల్లాడిని అమ్మమ్మ,తాతయ్యకు అప్పగించారు.