మంత్రి పొన్నం.. స్పీకర్ ప్రసాద్.. టీపీసీసీ చీఫ్ కు బ్లాక్ బెల్ట్
హూ… హా.. హై.. .అంటూ మన రాజకీయ నేతలు కరాటేలో పోటీ పడుతున్నారు. రాజకీయాల్లో మాతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తామంటూ బ్లాక్ బెల్ట్ నడుముకు చుట్టుకుని ఫోజులిస్తున్నారు. రాజకీయ వేదిక నుంచి కరాటే మ్యాట్పైకి వచ్చి తలపడ్డారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా కరాటే రింగ్లో తలపడ్డారు. ఇదేదో యాక్షన్ సినిమా సన్నివేశం కాదు, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వాస్తవంగా జరిగిన విశేషం. ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్- 2025 పోటీలకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మధ్య కరాటే పోటీ జరిగింది. ఈ సందర్బంగా జాతీయ కరాటే చాంపియన్ షిప్ నిర్వాహకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్కు కరాటే బ్లాక్ బెల్ట్ ప్రధానం చేశారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ఇరువురు కలిసి కరాటే ఫైట్ చేస్తున్నట్లుగా ఫొటోలకు ఫోజులిచ్చారు.
కరాటే బెల్ట్లు అందుకున్న వెంటనే, ఇద్దరు నేతలు కరాటే పోజులిచ్చారు. నేతల సరదా పోజులు చూసి వేదికపైనే కాక, ప్రేక్షక లోకంలోనూ కాసేపు హర్షధ్వానాలు మార్మోగాయి. మామూలుగా సభల్లో మాటలతోనే ఎదిరించే రాజకీయ నాయకులు, ఇప్పుడు కరాటే రింగ్లో తలపడుతున్నట్టుగా కనిపించడం విశేషమైంది.
ఇక, రాజకీయాలతో పాటు మార్షల్ ఆర్ట్స్లోనూ రాణిస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్. ఆయన మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ సాధించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. గ్రాండ్ మాస్టర్ ఎస్.శ్రీనివాసన్ ఆయనకు బెల్ట్ను ప్రదానం చేశారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో వైడబ్ల్యూసీఏలో జరిగిన కరాటేలో మూడు గంటల పాటు సాగిన నైపుణ్య పరీక్షలో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయనకు ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ధ్రువపత్రాన్ని అందజేశారు.