బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేసీఆర్కు తాను లేఖ రాశానని చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదని కవిత స్పష్టం చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కవితను మీడియా ప్రతినిధులు లేఖ అంశంపై ప్రశ్నించారు. దీనికి స్పందించిన కవిత.. నిజమే ఆ లేఖ తానే రాశానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.
“ నేను కేసీఆర్కు లేఖ రాశాను. రెండు వారాల క్రితమే కేసీఆర్కు లేఖ రాశాను. నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేశాను. కేసీఆర్కు రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియడం లేదు. కేసీఆర్ దేవుడు.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్కు నేను రాసిన లేఖ బయటకు వస్తే.. పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటీ. కేసీఆరే మా నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. లేఖ రాయడంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నా లేఖ లీక్తో కాంగ్రెస్, బీజేపీ సంబరపడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాం. పార్టీలోని కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. లేఖ రాయడంలో నా పర్సనల్ ఏజెండా ఏమీ లేదు.’ అని కవిత చెప్పుకొచ్చారు.
తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని, అది హంగామా జరిగినట్లు తెలిసిందని చెప్పారు. గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్ కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగిందనీ, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని తాను ఇటీవలే చెప్పానన్నారు. ఇప్పుడు లేఖ బహీర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పానని కవిత చెప్పారు.
వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదన్నారు. తమ పార్టీ అధినేతకు రాసిన లేఖ బహీర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేసీఆర్ కూతురైన తాను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే… పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ఈ లేఖ బహీర్గతం కావడం బాధాకరంగానే ఉందని కవిత అన్నారు.