కాళేశ్వరం బ్యారేజీలకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సు చేసిన పరీక్షలను నిర్వహించడానికి భారీగా వ్యయం కానుంది. పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్తో పరీక్షలు చేయించడానికే రూ.20 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. వీటి కోసం మూడు బ్యారేజీల వద్ద డ్రిల్లింగ్ చేయడంతో పాటు మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. ఇవన్నీ కలిపి మరో రూ.30 కోట్ల వరకు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉందని అది తగ్గే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.
ఎన్డీఎస్ఏ సిఫార్సు మేరకు 9 పరీక్షలు చేయాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ సూచించడంతో పాటు దేనికి ఎంత కాలం సమయం పడుతుంది, ఏ పరీక్షకు ఎంత చెల్లించాలో పేర్కొంది. అయితే ఈ సంస్థకు చెల్లించాల్సిన మొత్తంతో పాటు పన్నులు, ఆయా పరీక్షల నిర్వహణకు చేయాల్సిన పనులు తదితరాలన్నీ కలిపి ఏ బ్యారేజీకి ఎంత ఖర్చు అవుతుందో నీటి పారుదల శాఖ ఇంజినీర్లు నిర్ధారించి ప్రభుత్వానికి సంబంధిత ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. వారి ప్రతిపాదనల ప్రకారం మేడిగడ్డ బ్యారేజీకి రూ.6.54 కోట్లు, సుందిళ్లకు రూ.6.42 కోట్లు, అన్నారానికి రూ.6.40 కోట్లు అవసరమని వారు తేల్చారు. వీటితో పాటు మూడు బ్యారేజీల్లో డ్రిల్లింగ్ చేసి బోర్వెల్ డేటా తీయాల్సి ఉంది. సీకెంట్ పైల్ లోతు 13.5 మీటర్లు కాగా, రాఫ్ట్ మూడు మీటర్లు, ఎండ్ సీల్ ఒక మీటర్తో పాటు డ్రిల్లింగ్ను రెండు మీటర్ల లోతు వరకు చేయాలని ఎన్డీఎస్ఏ సూచనలు చేసింది.
అయితే గతంలో కొంతదూరం వెళ్లగానే ఇసుక, నీళ్లు కలిసి రావడంతో బ్యారేజీకి ఏమవుతుందోనని నిలిపివేశారు. నాటి పరీక్షలో ఐదు మీటర్ల వరకు మాత్రమే రిపోర్టు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం సీడబ్ల్యూపీఆర్ఎస్ 35 మీటర్లు చేయాలని సూచించింది. గతంలో కొన్నిచోట్ల మాత్రమే ఇలా చేశారు. ప్రస్తుతం ఎన్ని గేట్లు ఉంటే అన్ని చోట్ల కూడా ఇలానే చేయాల్సి ఉంటుంది.