భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లు
రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతిలో పలు కీలక మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. భూ లావాదేవీలను సమర్దవంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో విజయవంతమైన లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని, ఇందుకోసం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణా అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతున్న లైసెన్స్డ్ సర్వే విధానంపై ఇటీవల సర్వే విభాగానికి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరిగిందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ పథకం 1999 లో కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ చట్టంలో చేసిన సవరణలతో ప్రారంభమై, 2005-06 నుంచి అమలులోకి వచ్చిందని, ఈపథకం ద్వారా భూముల రిజిస్ట్రేషన్కు ముందు మ్యూటేషన్ స్కెచ్ తయారుచేయబడుతుందని, ప్రీ-రిజిస్ట్రేషన్ స్కెచ్తో కొనుగోలు చేయబోయే భూమి గురించి విస్తీర్ణం మరియు టైటిల్ వంటి స్పష్టమైన భూసరిహద్దు వివరాలు ఉంటాయని అధికారులు గురువారం మంత్రికి వివరించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 6000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు, 4000 మందిప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నారని ఒక్కో లైసెన్స్డ్ సర్వేయర్ కు నెలకు సగటున 23 దరఖాస్తులు వస్తాయని దీని ద్వారా అతనికి నెలకు 25 వేల నుండి 30 వేల ఆదాయం వస్తుందని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్లు నిర్వహించి, రిజిస్ట్రేషన్ కు ముందు స్కెచ్ తయారుచేసి పోర్టల్లో అప్ లోడ్ చేస్తారు. వీరిపనులను ప్రభుత్వసర్వేయర్లు పరిశీలించి, సంబంధిత అధికారి ఆమోదిస్తారు. ఈ పథకంద్వారా భూలావాదేవీలు మరింత సమర్థవంతంగా, శాస్త్రీయంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు.