సుప్రీం కోర్టు మెట్లు ఎక్కనున్న బీఆర్ఎస్
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత తో శుక్రవారం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ములాఖాత్ అయ్యారు. ఆమెతో మాట్లాడి ధైర్యంగా ఉండాలన్నారు. న్యాయవ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు భరోసా వ్యక్తం చేశారు. తదనంతరం హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించిన నేపథ్యంలో…సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్లు చర్చించారు.
సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ అవకాశముందని తెలుస్తోంది. కాగా
బెయిల్ పిటిషన్ వేసే దాకా ఢిల్లీలోనే ఉండి… న్యాయవాదుల బృందంతో వారు సమన్వయం చేయనున్నారు.
18వ వరకు కస్టడి పొడగింపు
కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. శుక్రవారం సీబీఐ కస్టడీకి గడువు ముగియడంతో కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. సీబీఐ, కవిత తరఫున లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ వాదనలతో ఏకీభవించింది. కవిత జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తుందని.. ఇప్పటి వరకు నేరాన్ని రుజువు చేయడానికి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని చెరిపేస్తుందని సీబీఐ వాదనలు గట్టిగా వినిపించింది.
ఈ కేసులో అసలు విషయాలు బయటకు రావాలంటే కవితను విచారించాలని.. ఇందుకోసం కవిత రిమాండ్ ను పొడిగించి.. విచారించేందుకు మరికొంత సమయం కావాలని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. సీబీఐ కేసులో కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.