బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం ఆమె తెలంగాణ జాగ-ృతి కొత్త ఆఫీస్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్లో ఈ కార్యక్రమం జరగనుంది. మరోవైపు మజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్కు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్లో ధర్నా చేయనున్నారు. అక్కడే ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె కేసీఆర్కు పంపించిన లేఖ లీక్ కావడం సంచలనం రేపింది. తాజాగా ఆమె కొత్తగా తెలంగాణ జాగృతి ఆఫీస్ను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు కేసీఆర్ తనకు దేవుడు లాంటివాడని అంటూనే మరోవైపు పరోక్షంగా కేటీఆర్ను కవిత టార్గెట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జూన్ 4న ధర్నా చౌక్లో ఆమె మాట్లాడబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఇటీవలే తనకు సొంత ఎజెండా అంటూ ఏమిలేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయొద్దనేది తన వాదన అని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తను జైల్లో ఉన్న సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను కలుపుతామని చెప్పారని కవిత అన్నారు. కాగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.