Sunday, October 6, 2024

బెయిల్ కోసం కొత్త వ్యూహం.. పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కష్టాలు వీడటం లేదు.. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈ కేసులో బెయిల్ లభించలేదు..

దీంతో, బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. మరోవైపు, బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తోంది. తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది..

నిర్ణీత వ్యవధి లోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేక పోడంతో తమ క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

కొత్త వ్యూహం..

ఏదైనా ఒక కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి చట్టంలో పలు నిబంధనలు ఉన్నాయి.. నిర్దేశించిన సమయంలో దర్యాప్తు పూర్తి చేయకపోతే జ్యూడిషీయల్ కస్టడీలో ఉన్న నిందితులకు బెయిల్ పొందే హక్కు ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-CRPC నిందితులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.

సీఆర్‌పీసీ 167(2) ప్రకారం ఏదైనా ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు నిర్దిష్ట గడువు లోగా విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసులు సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో నిందితులకు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. దీనిని డిఫాల్ట్ బెయిల్ అంటారు.

ప్రతి కేసు విషయంలో డిఫాల్ట్ బెయిల్ నింబధనలు ఒకే విధంగా ఉండవు. నేరాలు, కేసుల తీవ్రత ఆధారంగా గడువు ఉంటుంది. సాధారణంగా నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తే దర్యాప్తు సంస్థలు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరాల్సి ఉంటుంది. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆ వ్యక్తి జ్యూడిషీయల్ కస్టడీకి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి నిందితుడిని విచారించాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవల్సి ఉంటుంది.

గడువు దాటితే..

ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన కస్టడీ గడువు ముగిసినా విచారణ పూర్తి కాపోతే.. దర్యాప్తు సంస్థలు కోర్టును మరింత గడువు కోరతాయి. దీంతో న్యాయస్థానం కస్టడీని పొడిగిస్తూ ఉంటాయి.

మరణ శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు గరిష్ఠంగా 90 రోజులు ఉంటుంది. మిగతా కేసుల విషయంలో గరిష్టంగా దర్యాప్తు సమయం 60 రోజులు ఉంటుంది. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ పూర్తి కాకపోతే నిందితులు బెయిల్ పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు.

కవిత కేసుకు సంబంధించి ఈ గడువు పూర్తవడంతో ఆమె తరఫున లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular