- ఫోన్ ట్యాపింగ్లో కీలక నిర్ణయం
- అధికారుల వాంగ్మూలంతో కేసులు
- రాజకీయ నేతలకు నోటీసులు
టీఎస్, న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎస్ఐబీ పోలీసుల వరకు సాగిన విచారణ.. ఇప్పుడు రాజకీయ నేతలకూ చేరుతున్నది. ఈ కేసులో ఇప్పటిదాకా పోలీసులను విచారించిన సిట్ దర్యాప్తు బృందం.. ఇప్పుడు ఈ కేసులో భాగస్వాములుగా భావిస్తున్న వారందరినీ విచారణకు పిలువాలని నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో బయటకు వస్తున్న రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎవరెవరికి నోటీసులు అందుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఎవరెవరు..?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. ఆఫ్ ది రికార్డుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక నేతలకు లింకులున్నట్లుగా తేలింది. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి, మరో కీలక నేత, రాజ్యసభ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, మరో మాజీ మంత్రి.. ఇలా పలువురు ఈ కేసులో ఉన్నట్లు లీకులు వచ్చాయి. అంతేకాకుండా విపక్షాలు మాత్రం ఏకంగా అప్పటి సీఎంఓపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. సీఎం నుంచి ఆదేశాలు లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగదంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎంతో పాటుగా కీలక నేతలకు లింకులున్నాయని అనుమానాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్రావు అరెస్ట్ తర్వాత పలువురి పేర్లు చెప్పినట్లు కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతలను విచారణకు పిలిచేందుకు నోటీసులు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.