- రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు
- తనను చంపేస్తారంటూ లావణ్య ఆరోపణలు
హీరో రాజ్ తరుణ్, బాషా నన్ను చంపేయాలనుకుంటున్నారని లావణ్య ఆరోపించింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్యల వివాదం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్, శేఖర్ బాషా.. తనను చంపేయాలనుకుంటున్నారంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. శనివారం నార్సింగి పోలీస్ స్టేషన్కు లావణ్య వెళ్లారు. ప్రాణభయంతో బతుకుతున్నానని లావణ్య పేర్కొన్నారు. నిన్న రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు తన కంప్లైంట్ తీసుకోవడం లేదని లావణ్య ఆరోపించింది. మొన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. రాజ్ తరుణ్ తను కలిసి కోకాపేటలో ఇల్లు కొన్నామని, ఇల్లు కొన్నప్పుడు తను రూ.70 లక్షలు రాజ్ తరుణ్కి ఇచ్చినట్లు లావణ్య మీడియా ముందు వాపోయారు. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని లావణ్య ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయట్లేదని వాపోయింది. పోలీసులు తనకు న్యాయం చేయలేకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదులుతానని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు.