ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ డిసిపి రాధాకిషన్ రావుల కేసు కొట్టివేత
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్టాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టివేసింది. పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫోన్ టాపింగ్ కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్రావు, మాజీ డీసీపి రాధాకిషన్ రావులను నిందితులుగా చేర్చారు.
ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియగా.. గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయిన విషయం తెలిసిందే. పంజాగుట్ట పీఎస్లో నమోదైన రెండో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు, రాధాకిషన్రావు వేసిన పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎఫ్ఐఆర్లో హరీష్రావుతో పాటు- రాధాకిషన్రావును నిందితులుగా చేర్చారు. ఇప్పటికే ఇరు వాదనలు పూర్తవడంతో తీర్పును వెలువరించింది న్యాయస్థానం. ఇద్దరిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్ను ట్యాప్ చేసి.. తనను ఇబ్బందులకు గురిచేశారని.. వారి వల్ల తనకు ప్రాణహానీ ఉందంటూ రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ కొంతకాలం క్రితం డియాతో మాట్లాడారు. చక్రధర్ ఇచ్చిన సమాచారం, ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ను ఆధారంగా చేసుకుని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అందులో సరైన ఆధారాలు లేవని హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. హరీష్రావు, రాధాకిషన్ వాదనలతో ఏకభవించిన హైకోర్టు.. పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.