భారతదేశ 78వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం నలుమూల నుంచి ప్రత్యేక అతిథులతో పాటు పలు రంగాల్లో ప్రత్యేక సేవలు అందించి గుర్తింపు పొందిన సామాన్యులను సైతం అతిథులుగా ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అతిధుల జాబితాలో తెలంగాణకు చెందిన వాళ్లు కూడా ఉండటం ఇక్కడ చెప్పుకొతగ్గ విషయం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అతిథుల జాబితాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సామాజిక కార్యకర్తలు.. ఇలా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థినికి సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందటం విశేషం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వి గ్రేషిత కు ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలకు హాజరుకావాలని కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. 78వ ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడం పట్ల గ్రేషిత ఆనందం వ్యక్తం చేసింది. గ్రేషిత కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇక పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు కూర సుజాత సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్నారు. కేంద్రం నుంచి ఈ అరుదైన అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారామె. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ కు చెందిన శశాంక్ విశ్వనాథ్కు ఢిల్లీలో నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.