నేపాల్కు చెందిన ప్రేమ్ రావల్ (34) హైదరాబాద్లోని కూకట్పల్లికి వచ్చి హౌస్ కీపింగ్ చేస్తున్నాడు. భార్య యశోద, ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలిసి కేపీహెచ్బీ కాలనీ నాలుగో ఫేజ్లో ఉంటున్నాడు. నెల క్రితం యశోద పిల్లలతో నేపాల్కు వెళ్లగా, ప్రేమ్ రావల్ స్నేహితుడితో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో శనివారం రాత్రి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ముందు పెద్ద కుమార్తెతో తాను చనిపోతున్నట్లు వీడియో కాల్ చేసి తెలిపాడు. అతడి అంత్యక్రియలకు ఆర్థిక పరిస్థితులు అడ్డువచ్చాయి. కుటుంబ సభ్యులు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మృతదేహాన్ని అక్కడకు తీసుకెళ్లలేని దుస్థితి. దీంతో రాజస్థాన్లో ఉంటున్న ప్రేమ్ అన్నయ్య బల్వబహుదూర్ వచ్చి ఏడో ఫేజ్లోని శ్మశాన వాటికలోనే దహన సంస్కారాలు నిర్వహించారు. చుట్టుపక్కల ఉంటున్న సుమారు 80 మంది నేపాల్ నుంచి వలస వచ్చిన వారు హాజరయ్యారు. అంతిమ సంస్కారాలను వాట్సప్ వీడియో కాల్లో కుటుంబ సభ్యులకు చూపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అస్తికలు సేకరించి ఎల్లుండి తమ ఊరు బయలుదేరుతామని మృతుడి అన్నయ్య అన్నారు. మిగతా కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో చేస్తామని ప్రేమ్ అన్నయ్య బోరున ఏడుస్తూ వివరించాడు. ప్రేమ్ తమ్ముడు కూడా సూరత్లో ఉన్నాడు.